ANDRAPRADESH, KADAPA: గొప్పలు చెప్పుకోవటం తప్పు కాదు. కానీ.. దానికో పరిమితి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడు. ఈ విషయంలో తెలుగు తమ్ముళ్లు తరచూ తప్పు చేస్తుంటారు. 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేయటమే కాదు.. దానికి సంబంధించి ఆయన చేసిన ప్రచారం 2019లో ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలేలా చేసిందన్న విషయాన్ని చంద్రబాబు ఇప్పటికి గుర్తించలేదా? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి కారణం.. తాజాగా జరిగిన మహానాడులో అమరావతిని ఆయన హైలెట్ చేసిన వైనమే దీనికి కారణంగా చెప్పాలి.
దివంగత మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆకాంక్ష అన్నట్లుగా ఆయన ప్రసంగిస్తున్న వీడియోను మహానాడు వేదికగా ప్రదర్శించటం తెలిసిందే. మొత్తం ఐదు నిమిషాల నిడివి ఉండే ఈ వీడియోను అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన సంగతి తెలిసిందే. సదరు వీడియోలో టీడీపీ ఆరంభం.. ప్రస్థానం.. చంద్రబాబు పాలనా దక్షత.. యువనేతగా లోకేశ్ సాధిస్తున్న విజయాలు.. అమరావతి.. పోలవరం ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు.. టీడీపీ అమలు చేసిన సంక్షేమం.. డెవలప్ మెంట్ గురించి చెప్పుకొచ్చారు.
చంద్రబాబు పాలన.. ఆయన విజన్ ను ఎన్టీఆర్ చేత చెప్పించారు. ట్యాంక్ బండ్ నిర్మాణంతో హైదరాబాద్ - సికింద్రాబాద్ మధ్య సాంస్క్రతిక వారధిని తాను కడితే.. సైబరాబాద్ అనే గొప్ప నగరాన్ని నిర్మించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచాన్ని సాంకేతిక వారధిని చంద్రబాబు అందించారన్నారు. రూ.లక్షల జీతాల్ని ఏరోజైనా కలగన్నామా? దాన్ని సుసాధ్యం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని పేర్కొన్నారు. తన కలల్ని లోకేశ్ నెరవేరుస్తున్నారని చెప్పటం కాస్త ఎక్కవైతే.. ఏపీ రాజధాని అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలే చాలా ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
దేవేంద్రుడు అసూయపడేలా.. మయుడు అబ్బుర పడేలా ప్రజారాజధాని అమరావతి రూపుదిద్దుకోవాలని తాను కోరుకుంటున్నట్లుగా ఎన్టీఆర్ ఆకాంక్షిస్తున్నట్లుగా సిద్ధం చేసిన వీడియోతో టీడీపీ మరో తప్పు చేసినట్లుగా చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి దగ్గర దగ్గర ఏడాది కావొస్తోంది. ఈ ఏడాదిలో రాజధాని అమరావతిలో చోటు చేసుకున్న మార్పులు అంతగా లేవన్న సంగతి తెలిసిందే. గతంలోనూ అమరావతి గురించి గొప్పలు చెప్పటం.. ఐదేళ్ల పదవీ కాలంలో సరైన పక్కా భవనాలు కట్టలేదని.. సినిమాల్లో మాదిరి కట్టుకథలు.. గ్రాఫిక్స్ మాత్రమే చూపించారంటూ జగన్ అండ్ కో చెప్పిన మాటల్ని ఏపీ ప్రజలు నమ్మటం తెలిసిందే.
దీనికి కారణం.. అమరావతి విషయంలో మొదట్నించి జరుగుతున్నది.. జరిగేది తక్కువ.. చేసింది చాలా ఎక్కువన్న ప్రచారమే దెబ్బ కొట్టిది. తాజాగా కూడా మళ్లీ అదే తప్పు చేస్తున్నారని చెప్పాలి. దేవేంద్రుడు అసూయ చెందేలా అమరావతిని నిర్మిస్తామని చెప్పే కన్నా.. చేతల్లో చూపించి.. ఆ తర్వాత చెప్పిస్తే బాగుంటుంది. ఇలాంటి గొప్పలతో ప్రజల్లో అంచనాలను భారీగా పెంచేయటం ద్వారా.. రేపొద్దున చేసిన పనులేమీ పెద్దగా ప్రభావితం చేయలేవు.
ఇప్పటికి చంద్రబాబు చేతిలో కేవలం నాలుగేళ్లు మాత్రమే ఉన్నాయి. ఈ తక్కువ వ్యవధిలో.. దేవేంద్రుడు అబ్బురపడేలా అమరావతి నిర్మాణం అసాధ్యం. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. కానీ. ఇలాంటి మాటలతో హైప్ క్రియేట్ చేయటం ద్వారా మళ్లీ ప్రజల్లో ఆశల్ని భారీగా పెంచటం.. వాటికి తగ్గట్లు రియాల్టీలో మార్పులు లేకపోవటం.. పార్టీకి దెబ్బ పడేలా మారుతుందన్న ముప్పును చంద్రబాబు అండ్ కో ఎందుకు గుర్తించరు. దీనికంటే.. అమరావతిపై ప్రత్యేక శ్రద్దతో పనుల్ని జెట్ స్పీడ్ తో చేపట్టి.. కొంత పూర్తి చేసిన తర్వాత ప్రపంచానికి అమరావతిని ప్రమోట్ చేసే పని చేస్తే బాగుంటుంది.అందుకు భిన్నంగా పొగడ్తలతో పనులు పూర్తి కావన్న విషయాన్ని చంద్రబాబు ఎప్పటికి గుర్తిస్తారో?