Hot Posts

6/recent/ticker-posts

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇసుకాసురుడు!


ప్రభుత్వం మారినా..ఫ్యాన్‌ నేతదే పెత్తనం

కాకినాడకు రెండు రీచ్‌లు
పొడగట్లపల్లి,కాటవరం కేటాయింపు
అక్కడ వైసీపీ నేత గుత్తాధిపత్యం
ద్వారంపూడి అనుచరుడి దందా
తెరముందు వేరే కంపెనీలు
తెరవెనుక ఇష్టారాజ్యం
స్టాక్‌యార్డులకు ఇసుక ససేమిరా
ఇసుక అందక ప్రజల ఇబ్బందులు

ANDRAPRADESH, KAKINADA: రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ఇసుక రీచ్‌లపై వైసీపీ నేతల పెత్తనం కొనసాగుతూనే ఉంది. ఏ మాత్రం జంకుబొంకు లేకుండా అధికారుల సాయంతో రీచ్‌లపై పెత్తనం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం మారినా ఆధిపత్యం చలాయిస్తున్నారు. వైసీసీ ఐదేళ్ల పాలనలో ఇసుక, గ్రావెల్‌ తవ్వకాల్లో హవా కొనసాగించిన కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుడు ఇప్పుడు తనకు ఎదురులేదన్నట్టు వ్యవహరిస్తున్నాడు. 

కాకినాడ జిల్లాలో స్టాక్‌యార్డులకు ఇసుక సరఫరా చేసేందుకు కేటాయించిన రెండు ర్యాంపుల్లో పాగావేసి అడ్డగోలుగా వ్యవహ రిస్తున్నాడు. స్టాకుయార్డు నిర్వాహకులకు ఇసుక ఇవ్వాల్సి ఉండగా నిరాకరిస్తున్నారు. ఆ ఇసుకను విశాఖతో పాటు ఇతర ప్రాంతాలకు అడ్డగోలుగా విక్రయించేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా యార్డులను దక్కించుకున్న నిర్వాహకులు జనానికి ఇసుక సరఫరా చేయలేక తలపట్టుకుంటున్నారు.

ప్రభుత్వం చేసిందిదే..
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక విధానంలో మార్పు తీసుకువచ్చింది. ఇసుక ఉచితంగా తవ్వుకునేలా ఆదేశాలిచ్చింది. వర్షాకాలంలో ఇసుకకు ఇబ్బందులు లేకుండా నియోజకవర్గాల్లో స్టాకుయార్డులను ఏర్పాటు చేసింది. వర్షాలు రావడానికి ముందే రీచ్‌ల నుంచి ఇసుక తెచ్చి వీటిలో నిల్వ చేసుకునేలా ఆదేశాలు జారీచేసింది. అందులో భాగంగా కాకి నాడ జిల్లాలో పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తి పాడు, పిఠాపురంలోని చిత్రాడ, కరపలోని ఉప్ప లంకలో స్టాకు యార్డులకు దరఖాస్తులను ఆహ్వానించి కంపెనీలను ఎంపిక చేసింది. 

వీటిని దక్కించుకున్న స్టాకుయార్డు నిర్వాహకులకు కోనసీమ జిల్లా రావులపాలెం మండలం పొడగట్లపల్లి, తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కాటవరం ఇసుక ర్యాంపులను ప్రభుత్వం కేటాయించింది. ర్యాంపుల్లో ఇసుక తవ్వి స్టాకుయార్డు నిర్వాహకులకు విక్రయించేందుకు వీలుగా గనుల శాఖ కొన్ని నెలల కిందట కంపెనీలను ఆహ్వానించింది. పొడగట్లపల్లి ర్యాంపు తేజ ఇన్‌ ఫ్రాటెక్‌, కాటవరం ర్యాంపు మిథులా కన్‌స్ట్రక్షన్‌ దక్కించుకున్నాయి. రెండు కంపెనీలు ఆయా ర్యాంపుల నుంచి కాకినాడ జిల్లా స్టాకు యార్డులకు ఇసుకను తవ్వి విక్రయించాలి. కానీ ఇక్కడే కథ మలుపు తిరిగింది.

దోపిడీ సాగుతుందిలా..
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆ పార్టీ నేతలు ఇసుకను అడ్డగోలుగా దోచేసి వందల కోట్లకు పడగలెత్తారు. జనానికి ఇసుక దొరకకుండా చేసి అధిక ధరకు విక్రయించేసుకున్నారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. రెండు ర్యాంపులను దక్కించుకున్న కంపెనీలతో తెర వెనుక ద్వారంపూడి అనుచరుడైన ఓ హోటల్‌ను ఇంటిపేరుగా మార్చుకుని హవా చెలాయిస్తున్న నేత ఒప్పందం కుదుర్చుకున్నాడు. రెండు ర్యాంపుల్లో పాగావేసి ఇప్పుడు అడ్డగోలుగా ఇసుక తవ్వేస్తున్నారు. ర్యాంపుల్లో ఇసుక కాకినాడ జిల్లా స్టాకుయార్డులకే ఇవ్వాల్సి ఉండగా బిల్లులు లేకుండా బయటకు అధిక ధరకు విక్ర యించేసుకుంటున్నారు. 

తీరా తమ స్టాకు యార్డుకు ర్యాంపు నుంచి ఇసుక ఇవ్వాలని వెళుతున్న నిర్వాహకులను బెదిరిస్తున్నాడు. ఇసుక కోసం వెళ్లిన లారీలను సైతం వెనక్కు తిప్పి పంపిచేస్తున్నారు. అయినా రీచ్‌లు అధికారికంగా దక్కించుకున్న కంపెనీలు విషయం తెలిసి సదరు నేతకు సహకరిస్తున్నాయి. ద్వారంపూడి అనుచరుడు కాకినాడ సిటీలో భూదాన్‌ భూమిలో కేటాయించిన స్టాకుయార్డును గుప్పిట్లో ఉంచుకుని తన ఆధీనంలో ఉన్న రెండు ర్యాంపుల నుంచి భారీగా ఇసుక తరలించేస్తున్నారు. ఇతర స్టాకుయార్డులకు మాత్రం ఇసుక ఇవ్వకుండా గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాడు. 

తాజాగా కాకినాడ సిటీ యార్డును భూదాన్‌ భూమి నుంచి తరలించాలని హైకోర్టు ఆదేశించడంతో ఇప్పుడు ఆ యార్డును గనులశాఖ రద్దు చేసింది. మరో పక్క వైసీపీ ఐదేళ్ల పాలనలో సదరు నేత అనుచరుడు కాకినాడ జిల్లాలో చెలరేగి పోయాడు. కనిపించిన చెరువులు, కొండల్లో గ్రావెల్‌ తరలించి కోట్లలో సంపాదించాడు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇసుక ర్యాంపులను గుప్పిట పెట్టుకుని సదరు నేత అనుచరుడు అడ్డగోలుగా ఆధిపత్యం చెలాయిస్తున్నా అధికారులు కిమ్మనడం లేదు.