ఏలూరు జిల్లా, ఏలూరు : యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నాలుగు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మెరుగైన జీవన విధానం, ఆరోగ్య ప్రయోజనాల కోసం యోగా ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి వివరించి యోగాసనాలపట్ల ఆసక్తి కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ మేరకు ఈనెల 29వ తేదీ గురువారం ద్వారకాతిరుమల పుణ్యక్షేత్రంలో హరిత హోటల్ వద్ద, జూన్ 5వ తేదీన పోలవరం మండలం పట్టిసీమ రివర్ ఇన్ రిసార్ట్ వద్ద, జూన్ 11వ తేదీన జంగారెడ్డిగూడెం గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయస్వామి దేవాలయం వద్ద, జూన్ 18వ తేదీన కామవరపుకోట మండలం జీలకర్రగూడెం, గుంటుపల్లి బౌద్ధరామాల వద్ద ఆయా తేదీల్లో ఉదయం 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు యోగాసనాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ప్రతి పర్యాటక కేంద్రంలో పెద్దసంఖ్యలో ప్రజలు యోగా కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంధ సంస్ధ ప్రతినిధులు, స్ధానిక ప్రజలందరిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేలా అన్ని శాఖల అధికారులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.