Hot Posts

6/recent/ticker-posts

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోణా అలర్ట్


ANDRAPRADESH: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కరోనా టెన్షన్ మళ్లీ వెంటాడుతోంది. భారత్‌లోనూ పలు దేశాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఏపీలో కూడా ప్రభుత్వం, అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ కొవిడ్-19పై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 

కేసుల నమోదును నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని అమలు చేయాలని వీరపాండియన్ ఆదేశించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.


ఆరోగ్య శాఖ కమిషనర్ హెల్త్ డైరెక్టర్, డీఎంఈ, సెకండరీ హెల్త్ డైరెక్టర్లకు లేఖ రాశారు. కొవిడ్ కేసుల గురించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని ఆయన పేర్కొన్నారు. కొవిడ్ కేసుల దృష్ట్యా కేంద్రం ఎలాంటి అధికారిక మార్గదర్శకాలు విడుదల చేయలేదని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. కేసుల ప్రాబల్యంపై నిశిత పర్యవేక్షణ జరుగుతోందని.. భయపడాల్సిన అవసరంలేదన్నారు. 

రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో జ్వరం కేసులు ఎక్కువగా లేవని ఆరోగ్య శాఖ తెలిపింది. అక్కడక్కడ కొవిడ్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయని..అన్ని ఆసుపత్రుల అధికారులు, సూపరింటెండెంట్లు పరిస్థితిని గమనిస్తూ ఉండాలని ఆదేశించారు. జ్వరం, గొంతునొప్పి కేసులు నమోదైనా వెంటనే ఆరోగ్య శాఖ కమిషనర్‌కు తెలియజేయాలని సూచించారు.

ముందు జాగ్రత్తగా ఆసుపత్రుల్లో ఆక్సిజన్, పరీక్ష కిట్లు, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. పీపీఈ కిట్లు, ఎన్‌95 మాస్క్‌లు, ఐసొలేషన్ గదులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. సిబ్బందిని అప్రమత్తం చేయాలని, పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. హెల్త్ డైరెక్టర్ 21వ తేదీన ఇచ్చిన మార్గదర్శకాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. డీఎంహెచ్‌వోలు పరిస్థితిని గమనిస్తూ ఉండాలని సూచించారు. 

కేసులు నమోదైన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్తులో కేంద్రం విడుదల చేసే మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా పర్యవేక్షణపై ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపాలని.. హెచ్‌వోడీలు, సూపరింటెండెంట్లకు మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతానికి ఇబ్బందులు లేకపోయినా అప్రమత్తత అవసరం అంటున్నారు.