Hot Posts

6/recent/ticker-posts

ఏపీలో ఆ రైతులకు పండగే.. ధర ఏకంగా రూ.17,500 పలుకుతోంది


ANDRAPRADESH, WEST GODAWARI, EAST GODAWARI, AMBEDKAR KONASEEMA: ఆంధ్రప్రదేశ్ రైతులకు తీపికబురు.. కొబ్బరి ధరలు భారీగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కొబ్బరి ఉత్పత్తి తగ్గింది. ఈ ప్రభావంతో ధరలు భారీగా పెరిగాయి.. క్వింటా కొబ్బరి ధర రూ.17,500కు చేరింది. ఇది మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని రికార్డు అని రైతులు, వ్యాపారులు అంటున్నారు. గతేడాది క్వింటాలు ధర రూ.9,500 ఉండగా.. ఈ ఏడాది అమాంతం పెరిగింది. మార్చిలో రూ.14 వేలు, ఏప్రిల్ మొదటి వారంలో రూ.15 వేలు, చివరి వారంలో రూ.16 వేలకు చేరింది. ఇప్పుడు ఏకంగా రూ.17,500కు పెరిగింది. కొబ్బరి మార్కెట్‌కు ఏపీలోని అంబాజీపేట, కేరళలోని అలెప్పీ, తమిళనాడులోని పొల్లాచి ప్రాంతాలు ఫేమస్.. ఈ ప్రాంతాల్లో కొబ్బరి దిగుబడి తగ్గింది.


పచ్చి కొబ్బరి ధర కూడా బాగానే ఉంది.. రైతులు వాటిని నేరుగా అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం వెయ్యి కాయల ధర రూ.14,000-14,500 వరకు ఉంది. వెయ్యి కాయలతో 85-90 కిలోల కొత్త కొబ్బరి వస్తుంది. కూలీలు, ఇతర ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అందుకే రైతులు పచ్చి కాయలనే అమ్ముకుంటున్నారు. తమిళనాడులో ఉత్పత్తి తగ్గడం వల్ల ఏపీలో ధరలు పెరిగాయంటున్నారు కొబ్బరి రైతులు.. తమిళనాడులో వెయ్యి కాయలతో 110-120 కిలోల కొత్త కొబ్బరి వస్తుంది. గతంలో 130-140 కిలోలు వచ్చేది.. కోనసీమ మార్కెట్‌లో కొత్త కొబ్బరి ధర పెరగడం ఆల్ టైమ్ రికార్డుగా ఉంది. ఇంత ధర ఎప్పుడూ రాలేదని అంటున్నారు. కొత్త కొబ్బరిని రైతులు ఉత్పత్తి చేయడం లేదంటున్నారు. ఇది కూడా ధరలు పెరగడానికి ఒక కారణం అంటున్నారు. గతంలో కొబ్బరి రైతులు గిట్టుబటు ధర లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ధరలు పెరగడంతో ఆనందంలో ఉన్నారు.

మరోవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొబ్బరి తోటలు సాగు చేస్తున్న రైతులు వినూత్న ఆలోచన చేశారు. కొందరు రైతులు తమ కొబ్బరి వనాల్లోనే రిసార్టులను నిర్మించి, పర్యటాకుల్ని స్వాగతిస్తున్నారు. తమ కొబ్బరి తోటల్లో ఖరీదైన హోటల్‌కు తీసిపోని విధంగా ఇలా రిసార్టుల్ని నిర్మించారు. ఈ ఉరుకులు, పరుగుల బిజీ జీవితం నుంచి కాస్త బ్రేక్‌ తీసుకుని ఇలా ప్రకృతి మధ్య విశ్రాంతి కోసం వచ్చేవారికి.. కోనసీమలోని అంబాజీపేట, అయినవిల్లి, రాజోలు, మలికిపురం, మామిడికుదురు మండలాల్లోని రిసార్టులు స్వాగతం పలుకుతున్నాయి. గెస్ట్ హౌస్ మొత్తం కావాలనుకునేవారు సుమారు రూ.50 వేలు.. ఒక్క గదిని మాత్రమే తీసుకోవాలనుకుంటే రోజుకు దాదాపు రూ.2,500 అద్దెగా నిర్ణయించారు. అక్కడి రిసార్టుల్లో ఏసీ, టీవీతోపాటు విడిగా వంట చేసుకునేందుకు కిచెన్‌‌లు అందుబాటులో ఉంటాయి. ఈ రిసార్టు్ల్లో శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు. పర్యాటకులకు ఇది మంచి అవకాశం అంటున్నారు.