ANDRAPRADESH: అధికారంలో ఉన్న పార్టీకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. వారికి ఉన్న ప్రతికూలతలు ఏంటి అంటే అధికారంలో ఉండడం వల్ల పెరిగే యాంటీ ఇంకెంబెన్సీ. అయితే తెలివిన రాజకీయం చేస్తే దానిని చాలా వరకూ తగ్గించుకోవచ్చు. ఏపీలో మూడు పార్టీలతో కలసి అధికారంలో ఉన్న కూటమి సర్కార్ పెద్దలు అదే ఆలోచిస్తున్నారు. అన్నీ మంచి శకునములే అన్నట్లుగా కేంద్రం ఏపీ మీద సానుకూలంగా ఉంది. అంతే కాదు ఏపీ మీద ఆధారపడి కేంద్రంలోని ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. దాంతో ఏపీలో అసెంబ్లీ సీట్ల పునర్ విభజన అన్నది జరగడం ఖాయమని అంతా అంటున్నారు. దేశవ్యాప్తంగా జనాభా గణనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ తెలంగాణాలో అసెంబ్లీ సీట్ల పెంపునకు ఇది ఒక శుభ సంకేతం అని భావిస్తున్నారు
అసెంబ్లీ సీట్లు ఎలా పెరుగుతాయి అంటే విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఏపీలో 175 నుచ్ని 225, అలాగే తెలంగాణాలో 119 నుంచి 154 దాకా అని అంటున్నారు. ఏపీ వరకూ చూస్తే ఏకంగా యాభై సీట్ల దాకా పెరుగుతాయి. ఇక మూడు పార్టీల కూటమికి సీట్లు కేవలం 175 మాత్రమే ఉండడంతో చాలా ఇబ్బందిగా ఉంది. పార్టీల మధ్య పొత్తులతో త్యాగం చేసేవారు అధికం అవుతున్నారు. దాంతో వీరందరికీ అకామిడేట్ చేయాలి అంటే కచ్చితంగా సీట్లు పెరగాలి అని కూటమి పెద్దలు భావిస్తున్నారు. అది 2029 ఎన్నికల లోపే జరుగుతుందని కూడా లెక్క వేస్తున్నారు ఇక 2009 సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన జరింది. అప్పట్లో వైఎస్సార్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అది కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ గా మారి మరోసారి వైఎస్సార్ సీఎం కావడానికి దోహదపడింది.
ఇక 2029 ముందు కనుక అసెంబ్లీ సీట్లు పెరిగితే కనుక అది కచ్చితంగా కూటమికే ప్లస్ అని అంటున్నారు మరో వైపు కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత వస్తే అది తమకు రాజకీయంగా లాభిస్తుందని జగన్ చూస్తున్నారు. వైసీపీ ఆశలకు చెక్ చెప్పాలీ అంటే అసెంబ్లీ సీట్ల పెంపు ఒక్కటే మార్గమని అంటున్నారు ఇలా కూటమి పెద్దలే కాదు ఆశావహులు కూడా గంపెడాశలు పెట్టుకున్న నేపధ్యంలో ఒక్కసారిగా చల్లని నీళ్ళు తెచ్చి చల్లేశారు యనమల. ఆయన తాజాగా మినీ మహానాడులో మాట్లాడుతూ ఏపీలో అసెంబ్లీ సీట్లు 2029 తర్వాత పెరుగుతాయని ఈ లోగా పెరగవని ఒక కబురు చెప్పి కూటమి పార్టీలకు ఆశావహులకు షాక్ ఇచ్చేశారు. సీట్లు ఎందుకు 2029లోగా పెరగవో ఆయన విడమరచి చెప్పలేదు కానీ పెరగవు కాక పెరగవు అని స్పష్టంగా చెబుతున్నారు.
యనమల సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయనకు పార్లమెంటరీ వ్యవస్థ పట్ల శాసన వ్యవహారాల మీద అపారమైన అనుభవం ఉంది. పెద్దాయన అలా చెప్పారు అంటే దాని వెనక ఏమి ఉందో అన్న చర్చ సాగుతోంది. యనమల మాటలను కొట్టిపారేయడానికి లేదని అంటున్నారు. ఒకవేళ యనమల మాటలే నిజమై 2029లోగా అసెంబ్లీ సీట్లు పెరగకపోతే మాత్రం కూటమికి ఇబ్బందులు తప్పవా అన్న చర్చ వస్తోంది. ఏది ఏమైనా సీట్ల పెంపు మీద ఇంకా ఆశలు అలాగే ఉన్నాయని మరి కొందరు సీనియర్ రాజకీయ నేతలు అంటున్నారు చూడాలి మరి యనమల జోస్యం నిజమవుతుందో లేక సీట్లు ముందే పెరిగి ఆయన అనుభవానికే సవాల్ చేస్తాయో.